వడ్డీ రేట్లు యథాతథం : ఆర్బీఐ ప్రకటన- జీడీపీ అంచనాలు కూడా..

ఊహించినదే జరిగింది! వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఫలితంగా రెపో రేటు 5.5శాతం వద్ద కొనసాగుతుంది.

Published on: Aug 06, 2025 10:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధిస్తున్న టారీఫ్​ల అనిశ్చితి నేపథ్యంలో దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) నిర్ణయించింది. ఈ మేరకు మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ద్రవ్య విధానంలో ‘న్యూట్రల్’ వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​ వివరాలు..
ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​ వివరాలు..

ఫలితంగా రెపో రేటు 5.5శాతం వద్ద కొనసాగుతుంది.

సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం.. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడవ ద్వైమాసిక మీటింగ్​. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి రేటు కోత, 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్​) సీఆర్ఆర్ తగ్గింపు ద్వారా సడలింపు చర్యలను ఆర్బీఐ ముందుగానే చేపట్టింది.

జూన్ నెల ఆర్బీఐమొనేటరీ పాలసీ మీటింగ్​లో, ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేటును 6 శాతం నుంచి 5.50 శాతానికి, అంటే 50 బేసిస్ పాయింట్లు తగ్గించి అందరిని ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో, ఎంపీసీ తమ విధాన వైఖరిని ‘అకామోడేటివ్’ నుంచి ‘న్యూట్రల్’కి మార్చింది. అంతేకాకుండా.. నగదు నిల్వల నిష్పత్తిని కూడా 4 శాతం నుంచి 3 శాతానికి, అంటే 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

“ద్రవ్యోల్బణం తగ్గడంతో గతంలో రెపో రేటును తగ్గించడానికి వీలు కలిగింది. ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో, మధ్యకాలంలో ఆర్బీఐ లిమిట్​ లోపలే ఉంటుందని అంచనా వేశాము. ఆహార ద్రవ్యోల్బణం పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది. అందుకే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నాము,” అని తాజాగా జరిగిన మీటింగ్​లో సంజయ్​ మల్హోత్రా తెలిపారు.

భారత దేశ జీడీపీపై..

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఎఫ్​వై26లో భారత దేశ జీడీపీ (6.5శాతం) అంచనాలను సైతం ఆర్బీఐ మార్చలేదు. కానీ అంతర్జాతీయ అనిశ్చితిని సంజయల్​ మల్హోత్రా గుర్తుచేశారు.

“అంతర్జాతీయంగా వాణిజ్య సవాలు కొనసాగుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగానే ఉంది. కానీ ప్రపంచ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నెమ్మదించవచ్చు,” అని ఆర్బీఐ గవర్నర్​ చెప్పుకొచ్చారు.

ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఇండియాపైనా 25శాతం టారీఫ్​లను ప్రకటించారు. రష్యాతో చమురు దిగుమతుల నేపథ్యంలో మరిన్న సుంకాలు విధిస్తానని భారత్​ను హెచ్చరించారు. ఇది దేశ జీడీపీని ప్రభావితం చేస్తుందన్న ఆందోళనల మధ్య ఆర్బీఐ గవర్నర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈసారి వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని మార్కెట్​లో అంచనాలు నెలకొన్నాయి. రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన అనంతరం, ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. నిఫ్టీ50 17 పాయింట్ల నష్టంతో 24,633 వద్ద ట్రేడ్​ అవుతోంది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 30 పాయింట్లు పెరిగి 80,740 వద్ద కొనసాగుతోంది.