పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో వికయించిన కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురికి వాంతులు, విరేచనాలతో సహా తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. ఆ తరువాత వారి పరిస్థితి మరింత విషమించింది. దీంతో వెంటనే వీరిని కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కురుపం మండల పరిధిలోని వనకబడి గ్రామంలో వికటించిన కల్లు తాగి పలువురు అనారోగ్యానికి గురయ్యారని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తీవ్రమైన విరేచనాలతో బాధపడుతున్న నలుగురిని చికిత్స నిమిత్తం కురుపం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు.
ఈ ఘటన జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అవసరమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో జె.నీలకంఠం (37), పువ్వాల రామ్ సింగ్ (25), జె.జోగారావు (38), జె.భూషణరావు (54)ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే జె. జోగారావుకు బీపీ సమస్య ఉండటంతో… ప్రత్యేకంగా వైద్యుల పరిశీలనలో ఉన్నారు.
బాధితులు నివసిస్తున్న వనకబాడి గ్రామంలో అత్యవసర వైద్య శిబిరం నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఇతరులకు తీవ్రమైన లక్షణాలు కనిపించకపోయినా… ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు వారికి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని…. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారని ఆయన తెలిపారు.