Yogandhra 2026 : యోగాంధ్రకు భారీ స్థాయిలో ఏర్పాట్లు - కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు!

Yogandhra 2026 registrations : ఆంధ్రప్రదేశ్‌లో 'ఇంటింటికీ యోగా' థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యోగా గురు బాబా రాందేవ్‌లు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Published on: Jun 18, 2026, 15:00:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేయడం ద్వారా యోగాను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టేలా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర
ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనే సాధకులకు, ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులను నిర్దేశించారు. ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచే ఉత్తమ యోగా మాస్టర్ ట్రైనర్లను గుర్తించి…. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదికగా వారికి ప్రత్యేక ప్రభుత్వ పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

జూన్ 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ఒకేసారి 5 వేల నుంచి 6 వేల మంది కలసి యోగాసనాలు వేసేలా అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రాష్ట్రస్థాయి ఈవెంట్‌కు ముఖ్యమంత్రితో పాటు బాబా రాందేవ్ హాజరవుతారు. ఒకవేళ జూన్ 21న వర్షం కారణంగా ఏవైనా అవాంతరాలు ఎదురైతే, ప్రత్యామ్నాయంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో స్టేట్ ఈవెంట్ సజావుగా సాగేలా అధికారులు బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేశారు.

1.33 లక్షల కేంద్రాలు.. కోటికిపైగా రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో యోగాంధ్ర ఉద్యమం ఏ స్థాయిలో సాగుతోందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యోగాంధ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.6 లక్షల మందిని యోగా ట్రైనర్లుగా (శిక్షకులుగా) తీర్చిదిద్దినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. జూన్ 21న జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా ప్రజలు తమ పేర్లను ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ దినోత్సవం సందర్భంగా జూన్ 18 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.33 లక్షల కేంద్రాలలో ఏకకాలంలో యోగా కార్యక్రమాలు జరిగేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే వేదికపై ‘యోగా@డెస్టినేషన్’ పేరుతో వచ్చే ఏడాది యోగా దినోత్సవం వరకు అనుసరించాల్సిన పూర్తి యోగా క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More