ఆదాయానికి మించిన ఆస్తులు - TTD డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

Published on: Sep 2, 2026, 10:22:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, బుధవారం ఉదయాన్నే మెరుపు దాడులు చేపట్టారు. ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని ముఖ్యమైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, ఆస్తుల పత్రాలు, నగదు, బంగారానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

  • ఈ దాడులు కేవలం లోకనాథం ఇంటికే పరిమితం కాలేదు. తిరుపతి, తిరుమలతో పాటు మొత్తం 5 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
  • తిరుమలలో ఉన్న డిప్యూటీ ఈవో లోకనాథం అధికారిక కార్యాలయంలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించి, రికార్డులను పరిశీలిస్తున్నాయి.
  • తిరుపతిలో నివసిస్తున్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.
  • ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలోనూ ఏసీబీ బృందాలు విస్తృతంగా శోధిస్తున్నాయి.

సుదీర్ఘ కాలంగా టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్న లోకనాథంపై పెద్ద ఎత్తున అక్రమాస్తుల ఫిర్యాదులు రావడంతోనే ఈ దాడులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఎంత మొత్తం ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

చాలా ఏళ్ల తర్వాత ఇలా..!

2011లో టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత టీటీడీ ఉద్యోగి నివాసంలో తనిఖీలు చేయడం ఇదే తొలిసారి అని సమాచారం…!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More