Andhrapradesh New Pensions : ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన పేద ప్రజలకు నూతన పెన్షన్లను అందించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన అర్హులందరికీ అక్టోబరు నెల నుంచే కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేసింది.

కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను స్వర్ణ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా మరో రెండు, మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరీల పింఛన్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
సీఎం ఆమోదంతో తుది నిర్ణయం
ఏయే కేటగిరీల పింఛన్లకు ఏ విధంగా దరఖాస్తులు స్వీకరించాలి, వాటి పరిశీలన ఎలా ఉండాలి అనే అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సెర్ప్ (SERP) ఉన్నతాధికారులు గురువారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ వివరాలతో అధికారులు నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) పంపించారు. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం పొందిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ లేదా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
మరోవైపు, అందిన దరఖాస్తుల సంఖ్యను బట్టి అర్హులందరికీ ఒకేసారి పింఛన్లు అందించాలా లేక విడతల వారీగా మంజూరు చేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.
మంత్రులతో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా, దశలవారీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.