అన్నదాత సుఖీభవ పథకంపై మరో అప్డేట్, ఖాతాల్లో డబ్బులు పడాలంటే ఇలా చేయండి
ఏపీ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన రైతు...రైతు సేవా కేంద్రాల్లో మే 20 లోపు ఆధార్, భూమి వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ద్వారా అందిస్తున్న రూ.6 వేలు కలిపి అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా రూ.20 వేలు అందించనుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు...ఏడాదిలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మే నెలలోనే అన్నదాత సుఖీభవ
సీఎం చంద్రబాబు మే నెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రారంభిస్తామని ఇటీవల స్పష్టం చేశారు. మే 20లోపు జాబితాలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు.
ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేశారు. రైతులు మే 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది చెబుతున్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చిన్న,సన్నకారు, కౌలు రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు
- మే 20,2025 లోపు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించండి.
- రైతు ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్(ఆధార్ తో లింక్ అయిన ఖాతా)
- రైతు సేవా కేంద్రంలోని సిబ్బందికి పై వివరాలు అందించాలి.
- అధికారులు రైతు వివరాలు ధృవీకరించి, లబ్దిదారుల జాబితాలో పేరు చేర్చుతారు.
- నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్నదాత సుఖీభవ పథకం దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే పీఎం కిసాన్ డబ్బులు సైతం జూన్ నెలలో పడే అవకాశం ఉంది.
అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
- ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
- హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ చూపిస్తుంది.
- లేదా రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదిస్తే వారి లాగిన్ లో స్టేటస్ తనిఖీ చేస్తారు.
మే నెల 20లోగా రైతులు రైతు సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేసి పైస్థాయి అధికారులకు పంపిస్తారు.
జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం మరోసారి ఈ వివరాలను ఆర్జీఎస్కు పంపుతారు.
అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు
- అన్నదాత సుఖీభవ స్కీమ్ ను భర్త, భార్య, పిల్లలతో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అమలుచేస్తారు. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్ గా పరిగణించి, పెట్టుబడి సాయం అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ప్రస్తుత, మాజీ ఎంపీలకు ఈ పథకం వర్తించదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్ పర్సన్లు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు అర్హులు కాదు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కార్యాలయాలు, ఇతర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
- నెలకు రూ.10 వేలు, ఆపైన పెన్షన్ తీసుకునే వారు సుఖీభవ పథకానికి అర్హులు కాదు. మల్టీటాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు.
- డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అర్హులు కాదు. గత ఏడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారు అనర్హులు.
- వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చినా అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు.
.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


