తెలుగు వారి సంస్కృతికి, రుచులకు మరియు కళలకు ప్రతిబింబంగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ…అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ను ఒక బ్రాండ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు.
నంది అవార్డుల పునరుద్ధరణ…
గత ప్రభుత్వ హయాంలో కళలు, సంస్కృతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ కందుకూరి, ఉగాది పురస్కారాలను అందజేశామని గుర్తుచేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నంది నాటకోత్సవాలు నిర్వహించి, ప్రతిభావంతులకు నంది అవార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల కోనసీమలోని జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ ఉదహరించారు. రాష్ట్రంలో లబ్ద ప్రతిష్టులైన స్వాతంత్ర్య సమరయోధులు, కవులు తదితరుల జయంతులు, వర్థంతులు జరుపుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నామని గుర్తుచేశారు.
అమరావతిని ప్రజారాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల ప్రత్యేక రుచిగా అభివర్ణిస్తూ.. జీవితంలోని నవరసాల కలయికే ఈ ఫెస్టివల్ అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులకు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులకు మరియు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.