బనకచర్ల టెండర్లు రద్దు - తెరపైకి కొత్త ప్రతిపాదన, నల్లమల సాగర్ వరకే పరిమితం...!
పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పిలిచిన టెండర్లను రద్దు చేసింది. మరోవైపు ఇదే స్థానంలో కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చే దిశగా కరసత్తు చేస్తోంది.
గత కొంతకాలంగా పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం… అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కేంద్రానికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఏపీలోని వామపక్ష పార్టీలతో పాటు పలు ప్రజాసంఘాలు కూడా ఈ ప్రాజెక్ట్ పై తీవ్రస్థాయిలో అభ్యంతరాలను వ్యక్తపరిచాయి.

మరోవైపు ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కూడా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కూడా పేర్కొంది. ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉన్నాయని, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలని వెల్లడించింది. పర్యావరణ అనుమతులకు సంప్రదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
అనేక అభ్యంతరాలు…!
ఈ ప్రాజెక్టుపై ఒక్క తెలంగాణ నుంచే కాదు… పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యతిరేకత మొదలైంది. గోదావరికి వరద సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసుకుంటామని తెలపటంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో…. ఏపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది.
అక్టోబర్ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది. అయితే ప్రత్యామ్నాయంగా మరో మార్గంపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
ముందుగా ప్రతిపాదించిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ ను మొత్తం రూ.80,112 కోట్లతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్ ను మొత్తం 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి…. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి తీసుకోనుంది. అక్కడ్నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించాలనేది ఏపీ సర్కార్ ప్లాన్. వీటి కోసమే టెండర్లను ఆహ్వానించింది.
తాజాగా టెండర్లను రద్దు చేయటంతో…. పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. 2 దశల్లో నిర్మాణ పనులను చేపట్టాలని భావిస్తోంది. త్వరలోనే పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం పేరుతోనే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలచేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్ జలాశయం వరకే ప్రాజెక్ట్ పరిమతవుతుంది.
గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుతో పోల్చితే… ఈ కొత్త అనుసంధానంతో భారీగా వ్యయం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి… ఏపీ ప్రభుత్వం అధికారికంగా వివరాలను ప్రకటించాల్సి ఉంది.

E-Paper












