AP New Pensions : కొత్త పింఛన్లపై కీలక అప్డేట్ - దరఖాస్తు గడువు పొడిగింపు!
AP NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు గడువును ఏపీ సర్కార్ ఈ నెల 18 వరకు పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు స్థానిక స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP NTR Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్ అందించింది. 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ పథకం కింద నూతనంగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి మరో అవకాశాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ దరఖాస్తు ప్రక్రియ గడువు ఈ నెల 16వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అర్హులైన వారెవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజుల పాటు….. అంటే ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ గడువు ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ లభించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు వివిధ చేతివృత్తులపై ఆధారపడిన అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని అధికారిక యంత్రాంగం సూచించింది.
ప్రత్యేక కౌంటర్లు
దరఖాస్తు ప్రక్రియ అత్యంత సులభంగా సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు మరియు పట్టణాల్లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే అర్హులైన అభ్యర్థులు నేరుగా ఈ కౌంటర్లకు వెళ్లి తమ దరఖాస్తులను అందజేయవచ్చు.
ఈ కౌంటర్లలో అందిన దరఖాస్తులను అధికారులు అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ప్రతి అర్జీని సమగ్రంగా తనిఖీ చేసిన అనంతరమే అర్హతలను ఖరారు చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులందరికీ దశలవారీగా కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 61,92,396 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందిస్తోంది. ఈ సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ప్రతి నెలా ఏకంగా రూ.2,694 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల చేతికే పంపిణీ చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ఈ పింఛన్ల పంపిణీ కోసమే ప్రభుత్వం రూ.73,508 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
- వృద్ధులు, వితంతువులు: నెలకు రూ. 4,000
- దివ్యాంగులు: నెలకు రూ. 6,000
- తీవ్రమైన అనారోగ్య బాధితులు: వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రూ. 10,000 వరకు
- సంపూర్ణ వైకల్యం ఉన్నవారు: నెలకు గరిష్టంగా రూ. 15,000
అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రానికి వెళ్లి, నింపిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. అక్కడి సిబ్బంది ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, దరఖాస్తుదారులకు కంప్యూటర్ నుంచి జనరేట్ చేసిన రసీదును అందజేస్తారు. ఈ రసీదు ద్వారా తమ దరఖాస్తు స్థితిని భవిష్యత్తులో పరిశీలించుకోవచ్చు.
ధ్రువీకరణ పత్రాలు:
- వృద్ధాప్య పింఛన్: వయస్సు ధ్రువీకరణ కోసం లబ్ధిదారుడి ఆధార్ కార్డ్ తప్పనిసరి.
- వితంతు పింఛన్: భర్త మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్) మరియు వితంతువు ఆధార్ కార్డ్.
- ఒంటరి మహిళలు: వివాహమై దూరంగా ఉంటుంటే కోర్టు జారీ చేసిన విడాకుల పత్రం సమర్పించాలి. పెళ్లి కాని వారైతే తహశీల్దార్ జారీ చేసిన 'వివాహం కాలేదు' అనే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
- దివ్యాంగులు: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సదరం (SADAREM) సర్టిఫికేట్.
- వృత్తిపరమైన విభాగాలు: చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సాంప్రదాయ పాదరక్షల తయారీదారులు, కల్లు గీత కార్మికులు తమ సంబంధిత శాఖల అధికారుల నుంచి పొందిన సర్టిఫికేట్ను అందించాలి.
- ట్రాన్స్జెండర్లు: జిల్లా మెడికల్ బోర్డు అధికారికంగా జారీ చేసిన సర్టిఫికేట్ జతచేయాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

