AP SET Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ (APSET) ఫలితాలు వచ్చేశాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఇటీవల జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ ఈసారి ఫలితాలను రూపొందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే ఈ ఏపీ సెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ ఏడాది మార్చి 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 సబ్జెక్టులకు గాను ఈ పరీక్షను నిర్వహించారు.
ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,075 మంది అభ్యర్థులు హాజరుకాగా…. వారిలో కేవలం 2,143 మంది మాత్రమే అర్హత సాధించగలిగారు. ఈ ఫలితాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన వారిలో 1,016 మంది పురుషులు ఉండగా, 1,127 మంది మహిళలు ఉన్నారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థుల సౌకర్యార్థం అర్హత పొందిన వారి రిజిస్ట్రేషన్ నంబర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సబ్జెక్టుల వారీగా, వివిధ సామాజిక వర్గాల (కేటగిరీలు) వారీగా కేటాయించిన కట్ ఆఫ్ మార్కుల పూర్తి వివరాలను కూడా ఏపీసెట్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు.
ఏపీ సెట్ కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమేనని అధికారులు గుర్తు చేశారు. భవిష్యత్తులో వివిధ విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామకాలు జరిపే సమయంలో, సదరు నియామక సంస్థలు లేదా యాజమాన్యాలు అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను, రికార్డులను తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.
ఏపీ సెట్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు https://apset.aptonline.in/APSET/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.
- హోం పేజీలోని ఏపీ సెట్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన రిజిస్ట్రేషన్ నెంబర్లతో కూడిన పీడీఎప్ ఉంటుంది.
- ఇందులో మీ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.