ఏపీలో యూనివర్సిటీల కోసం ఏకీకృత చట్టం.., సింగపూర్ టూర్కు బెస్ట్ టీచర్లు!
ఏపీలో యూనివర్సిటీల కోసం ఏకీకృత చట్టం రూపొందించనున్నట్టుగా మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మరోవైపు ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్కు పంపిస్తున్నట్టుగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిపాలనను క్రమబద్ధీకరించడానికి ఏకీకృత చట్టాన్ని రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో పాఠ్యాంశాలను ఉద్యోగ ఆధారితంగా మార్చడానికి వాటిని పునరుద్ధరించాలని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగు సంవత్సరాలు కళాశాలల్లో చదివినప్పటికీ.. ఉత్తీర్ణులైన చాలా మంది ఉద్యోగాలు పొందలేకపోతున్నారని గుర్తించారు. హైదరాబాద్ అమీర్పేటలో కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుని జాబ్స్ పొందుతున్నారన్నారు.

ఈ సమస్యను తగ్గించడానికి ఐటిఐలు, విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రైవేట్ కళాశాలలను రాష్ట్ర నైపుణ్య పోర్టల్కు అనుసంధానించాలని చెప్పారు. కళాశాలల్లో ఫేస్ రికగ్నేషన్ హాజరు వ్యవస్థలను తప్పనిసరి చేయాలన్నారు. కేజీ నుండి పీజీ వరకు సమర్థవంతమైన విద్యార్థుల ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని, రాష్ట్ర విశ్వవిద్యాలయాల జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) స్టాండింగ్లను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని లోకేశ్ నొక్కి చెప్పారు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బోధనా పోస్టుల ఖాళీలు, ఇ-గవర్నెన్స్ వంటి కార్యక్రమాల పురోగతిని మంత్రి లోకేశ్ సమీక్షించారు. విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, ఐఐఐటీలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లపై అప్డేట్స్ అడిగారు. 100 శాతం విద్యార్థుల నియామకాలను కన్ఫామ్ కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల అభిప్రాయ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పారు.
ఇంటర్మీడియట్ విద్యపై జరిగిన సమావేశంలో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచడంలో సహాయపడాలని లోకేశ్ అధికారులకు సూచించారు. అన్ని గ్రూపులకు వారాంతపు పరీక్షలు, విద్యార్థుల పనితీరును పర్యవేక్షించడానికి ట్రాకింగ్ వ్యవస్థతో సహా అమలు చేస్తున్న సంస్కరణల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు కాలపరిమితితో ఉండాలని లోకేశ్ సూచించారు.
సింగపూర్కు బెస్ట్ టీచర్లు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన 78 మందిని నవంబర్ 27 నుండి వారం రోజుల పాటు సింగపూర్కు పంపించి అక్కడ అధునాతన బోధనా పద్ధతులను అధ్యయనం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 2 వరకు ఉపాధ్యాయుల సందర్శన సింగపూర్లోని ప్రముఖ పాఠశాలల్లో వినూత్న బోధనా పద్ధతులు, తరగతి గది వాతావరణాలు, సాంకేతికత ఆధారిత అభ్యాస పద్ధతులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ఇటువంటి పద్ధతులను ఎలా అమలు చేయవచ్చో ఉపాధ్యాయులు తనకు వివరణాత్మక నివేదికను సమర్పించాలని లోకేష్ అన్నారు. గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఉండాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు.

E-Paper












