1985 నుంచి అనుమతులు లేని భవనాలను చట్టబద్ధం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లేని భవనాల క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Published on: Nov 13, 2025 5:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ - 2025 పేరుతో ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఇది అనుమతులు లేని భవనాలను క్రమబద్ధీకరించడానికి, అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను క్రమబద్ధికరించుకోడానికి చివరి అవకాశాన్ని అందిస్తుంది. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ GO-Ms-225 ఆర్డర్, జనవరి 1, 1985 నుంచి ఆగస్టు 31, 2025 మధ్య జరిగిన నిర్మాణాలకు వర్తిస్తుంది. ఈ పథకం పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో అనుమతి లేని భవనాలను చట్టపరమైన చట్రంలోకి తెస్తుంది.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

ప్రణాళికాబద్ధమైన పట్టణ వృద్ధి, పౌరుల జవాబుదారీతనం, పారదర్శకమైన పాలన కోసం రాష్ట్రం చేస్తున్న నిరంతర డ్రైవ్‌లో ఇది భాగమని అధికారులు తెలిపారు. గతంలో 2019 బీపీఎస్ పరిమిత సంఖ్యలో భవనాల క్రమబద్ధీకరణకు అవకాశాన్ని ఇచ్చింది. దీనివల్ల వేలాది నిర్మాణాలు పథకంలోకి రాలేదు.

'ఇకపై ప్రభుత్వం కఠినమైన అమలు అనుసరిస్తుంది. అనధికార నిర్మాణాలు అనుమతించరు. జాప్యాలకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి వచ్చే ఆదాయాన్ని డ్రైనేజీ, వరద తగ్గింపు, వ్యర్థాల తొలగింపు, రోడ్లు, ఇతర సౌకర్యాలు వంటి పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా వినియోగిస్తాం.' అని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ అన్నారు.

చట్టపరమైన చర్యలను నివారించడానికి యజమానులు వెంటనే BPS-2025 కింద నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికి UCIMS పోర్టల్‌లో దాదాపు 59,041 అనధికార భవనాల కేసులను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, CREDAI, NAREDCO, CLESA నుండి వచ్చిన వినతులు.. ఈ పథకం తుది విండోగా తిరిగి ప్రవేశపెట్టడానికి కారణం అయ్యాయి.

BPS-2025 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలలో నిర్మాణాలను క్రమబద్ధీకరించవచ్చు. అయితే ఏపీసీఆర్డీఏ రాజధాని నగర ప్రాంతంలోని భవనాలకు ఈ విండో ఓపెన్ అవ్వదు.

నోటిఫికేషన్ తేదీ నుండి 120 రోజుల్లోపు www.bps.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. వాటితో పాటు యాజమాన్య రుజువు, డ్రాయింగ్‌లు, ఫొటోలు, స్థిరత్వ ధృవీకరణ పత్రం, ఇతర ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.

ప్రతి దరఖాస్తుకు ప్రారంభ చెల్లింపు రూ. 10,000 చెల్లించాలి. జరిమానా ఛార్జీలు చదరపు అడుగుకు రూ. 40 నుండి రూ. 400 వరకు ఉంటాయి. కేటగిరీ, డివియేషన్, వినియోగం ఆధారంగా రేట్లు మారుతూ ఉంటాయి. అపార్ట్‌మెంట్‌లు, అదనపు అంతస్తులకు ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. 1997 ముందు నిర్మాణాలకు 25 శాతం, నోటిఫైడ్ మురికివాడల్లోని నివాస భవనాలకు 50 శాతం రాయితీలు ఉన్నాయి.

ప్రభుత్వ భూమి, పర్యావరణ నిషేధిత మండలాలు లేదా వివాదాస్పద యాజమాన్యంతో ఉన్న అనధికార భవనాలు పరిగణనలోకి తీసుకోరు. ఆగస్టు 31, 2025 తర్వాత ఏదైనా కొత్త నిర్మాణం జరిగితే కూల్చివేత, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

News/Andhra Pradesh/1985 నుంచి అనుమతులు లేని భవనాలను చట్టబద్ధం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం!
News/Andhra Pradesh/1985 నుంచి అనుమతులు లేని భవనాలను చట్టబద్ధం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం!