మధ్య ఛత్తీస్గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీనికి తోడు రుతుపవన ద్రోణి, షియర్ జోన్ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తున్నాయి.
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు..

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో…. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఇవాళ (జూలై 31) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ప్రజలకు అలర్ట్…
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈదురుగాలులు వీచే సమయంలో ఆరుబయట నిలబడకూడదని సూచించారు. చెట్లు, హోర్డింగ్స్, పాత భవనాలు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందవద్దని సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుపాటు ముప్పు ఉన్నందున వర్షం వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేశారు.