చిత్తూరు : కాలేజీలోని మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి సూసైడ్ - వారంలో రెండో ఘటన….!
చిత్తూరు జిల్లాలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి కాలేజీలో విషాదం జరిగింది. భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.
చిత్తూరు జిల్లాలోని శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్టూడెంట్ సూసైడ్
తీవ్రగాయాలైన అతడిని ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తరువాత… మృతుడి కుటుంబ సభ్యులు కాలేజీకి చేరుకున్నారు. సూసైడ్ గురించి కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి రావడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణ సమయంలో చిత్తూరు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు మృతుడి కుటుంబ సభ్యులను దూరంగా నెట్టడంతో మరింత గందరగోళం నెలకొంది.
తమ కుమారుడి మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా తమ పట్ల దుసురుగా ప్రవర్తించారని ఆరోపించారు.
చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ… ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
మరోవైపు గత నెలలోనూ(అక్టోబర్ 31) నందిని అనే విద్యార్థి కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో నందిని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. అయితే చిత్తూరు తాలూకా పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేశారు. వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమా లేదా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.