తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులో పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. మొత్తం 10 మంది ప్రయాణికులు ఉండగా… సురక్షితంగా బయటపడ్డారు.

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. తెల్లవారుజాము సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే… ప్రయాణికులను బయటికి దింపేశాడు. వాహనం పూర్తిగా దగ్ధం కాగా… మొత్తం 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. డైనమోలో సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయని డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
“టోల్ ప్లాజా దగ్గర బస్సు ఆగిన తర్వాత డ్రైవర్ ఇంజిన్ ను పరిశీలించి నిప్పురవ్వలను గమనించాడు. అతను వెంటనే వాహనంలో ఉన్నవారిని అప్రమత్తం చేశాడు, వారు వెంటనే దిగారు. డ్రైవర్ వెంటనే స్పందించటంతో భారీ ప్రమాదం తప్పింది” అని పోలీసులు తెలిపారు.
వాహనంలో ఉన్నవారిని కేవలం 10 నిమిషాల్లోనే లగేజీతో పాటు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ప్రయాణికులు వెళ్లేందుకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని వివరించారు. ట్రాఫిక్ జామ్ కావటంతో వెంటనే నియంత్రించారు. కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.