ఈ తేదీ నుంచి చెన్నై టూ నరసాపురం వరకు వందే భారత్ సర్వీసులు స్టార్ట్
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్. చెన్నై సెంట్రల్ నుంచి-నరసాపురం వరకు వందే భారత్ రైలు రానుంది. సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తాజాగా రైల్వే ప్రకటించింది.
చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా రైల్వే బోర్డు ఏ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయో క్లారిటీ ఇచ్చింది. 12 జనవరి 2026 నుంచి వందే భారత్ సర్వీసులు నరసాపురం వరకు వెళ్తాయని సదరన్ రైల్వే ప్రకటించింది. దీనితో వందే భారత్ రైలు ద్వారా విజయవాడ చేరుకుని.. తర్వాత నరసాపురం వైపు జర్నీ చేసేవారికి ఉపశమనం కలగనుంది. నేరుగా నరసాపురం వరకూ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ట్రైన్ నెంబర్ 20677 చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతుంది. రేణిగుంట(7:10), నెల్లూరు(8:30), ఒంగోలు(9:45), తెనాలి(11:10), విజయవాడ(11:45), గుడివాడ(12:30), భీమవరం టౌన్(1:15), నర్సాపురం(2:10)కి చేరుకుంటుంది.
నర్సాపురం నుంచి చెన్నై సెంట్రల్ వచ్చే ట్రైన్ నెంబర్ 20678 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.50కి బయలుదేరుతుంది. 3:20 గంటలకు భీమవరం, మధ్యాహ్నం 4:10కి గుడివాడ, 4:50కి విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి 4.55 గంటలకు బయలుదేరుతుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్లి రాత్రి 11:45 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్కు వస్తుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
పలు రైళ్లు రద్దు
విజయవాడ-దువ్వాడ సెక్షన్లో తుని-హంసవరం-అన్నవరం-రావికంపాడు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సెక్షన్ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్లాకింగ్ (ఎన్ఐ) పనుల కారణంగా, 20 నవంబర్ 2025న కింది రైళ్లు రద్దు అవుతాయి.
17267 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం, 17268 విశాఖపట్నం - కాకినాడ పోర్ట్, 67285 రాజమండ్రి - విశాఖపట్నం, 67286 విశాఖపట్నం - రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.ప్రయాణీకులు గమనించి తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.













