చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. ఈ హత్య ఘటన 2015 నవంబరు 17వ తేదీన చోటు చేసుకుంది.

అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న చంద్రశేఖర్, జీఎస్ వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
కోర్టు తీర్పు సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, సంబరాలు వంటివి చేసుకోకుండా ఆంక్షలు విధించారు. కోర్టు పరిసర ప్రాంతాల్లోనూ భద్రతను ఏర్పాటు చేశారు.
కేసు వివరాలు:
2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. కఠారి మోహన్, ఆయన మేనల్లుడైన చింటూ మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిని అడ్డు తొలగించుకోవాలని చింటూ ప్లాన్ వేశాడు. మరో నలుగురితో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించి… కఠారి అనురాధపై కాల్పులు జరిపారు. పక్కన గదిలో ఉన్న కఠారి మోహన్ను కత్తులతో నరికేశారు. దీంతో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది.
దాదాపు 10 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. 352 వాయిదాలు, 130 మంది సాక్షులను విచారించాక ఐదుగురికి ఉరిశిక్ష ఖరారైంది. A1గా ఉన్న చింటూకు రూ.70 లక్షలు జరిమానా కూడా విధించింది. మేయర్ కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రమాద సమయంలో గాయపడిన సతీష్ కు రూ.20 లక్షలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శిక్ష పడిన వారిని కడప జైలుకు తరలించనున్నారు. ఇందుకోసం పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.