Hindupuram : కత్తితో దాడి - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పై సీఐ కాల్పులు
హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై రౌడీషీటర్ నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. పారిపోతున్న క్రమంలో నాగేంద్రంపై సీఐ కాల్పులు జరిపాడు. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలో సీఐగా పని చేస్తున్న ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ… నాగేంద్ర కాలిపై కాల్పులు జరిపారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
గాయపడిన సీఐ, కానిస్టేబుల్తో పాటు నిందితుడిని హిందూపురంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ గ్యాంప్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నాగేంద్ర తిరగబడ్డాడు.
నిందితుడిపై 90కిపైగా క్రిమినల్ కేసులు - డీఎస్పీ
హిందూపూర్ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ కేవీ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం…. నిందితుడిని పట్టుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసుల బృందం వెళ్లింది. ఉదయం 6.30 గంటల సమయంలో కానిస్టేబుల్ పై దాడి చేశాడు. అతనికి గాయాలయ్యాయి. మరో బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. సీఐ నిందితుడి వద్దకు వెళ్లగా… అతను లొంగిపోయినట్లు నటించాడు. కానీ అకస్మాత్తుగా ఇన్స్పెక్టర్ పై కత్తితో దాడి చేశాడు.
ఇన్స్పెక్టర్ మొదట హెచ్చరికగా గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. కానీ నిందితుడు ముందుకు రావటంతో… ఆత్మరక్షణలో భాగంగా అతనికి మోకాలిపై కాల్పులు జరిపాడని డీఎస్పీ తెలిపారు. దాదాపు 90 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు.
40 ఏళ్ల నాగేంద్రకు సుదీర్ఘ నేర చరిత్ర ఉందని…. ఆయనపై శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోనే దాదాపు 41 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ పేర్కొన్నారు. చిలమత్తూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన సామూహిక అత్యాచారం కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో కోర్టు విచారణలకు రాకుండా నాగేంద్ర తప్పించుకుని తిరుగుతున్నాడని డీఎస్పీ మహేష్ తెలిపారు.