Margadarsi Bangaru Kutumbam : పీ4 ఓ గేమ్ ఛేంజర్, పేదరికం లేని సమాజం కోసమే కృషి- సీఎం చంద్రబాబు

Margadarsi Bangaru Kutumbam : పేదరిక నిర్మూలనే ధ్యేయంగా 'మార్గదర్శి-బంగారు కుటుంబం' పేరిట పీ4 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు.

Published on: Mar 30, 2025, 20:57:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Margadarsi Bangaru Kutumbam : పేదరిక నిర్మూలనలో భాగంగా 'మార్గదర్శి-బంగారు కుటుంబం' పేరుతో పీ4కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పీ-4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుందని, అందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

పీ4 ఓ గేమ్ ఛేంజర్, పేదరికం లేని సమాజం కోసమే కృషి- సీఎం చంద్రబాబు
పీ4 ఓ గేమ్ ఛేంజర్, పేదరికం లేని సమాజం కోసమే కృషి- సీఎం చంద్రబాబు

పీ4 తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ‘మార్గదర్శి- బంగారు కుటుంబం’ నినాదంతో పీ-4 కార్యక్రమానికి మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ప్రభుత్వం ఎంపిక చేసింది.

అర్హులు గ్రామ సభల ద్వారా నిర్థారణ

గత వైసీపీ ప్రభుత్వం వ్యాపార సంస్థలను వాటాలు అడిగితే, కూటమి ప్రభుత్వం అట్టడుగున ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు సహాయపడాలని అడుగుతోందని డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్అన్నారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే పీ-4 కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి అందరూ అండగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వ నిర్వాకం వలన భవన నిర్మాణ కార్మికులు అధికారికంగా 34 మంది, అనధికారంగా వందల మంది చనిపోయారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కూటమికి మద్దతు ఇచ్చానన్నారు. పీ4 అంటే డబ్బులు ఇచ్చేయడం మాత్రమే కాదని, పేదరిక నిర్మూలనే ధ్యేయం అన్నారు.

"రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక కోసం ఆలోచిస్తే, విజన్ ఉన్న చంద్రబాబు లాంటి నాయకులు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలా రెండు మూడు తరాల కోసం ఆలోచించి పీ4 కార్యక్రమాన్ని రూపొందించారు. అర్హులను గ్రామ సభల ద్వారా నిర్ధారణ చేస్తాం. అన్యాయంగా ప్రభుత్వ పథకాలకు దూరం అయిన వారి కోసం అవసరమైన సవరణలు చేయడానికి ప్రణాళికలు రూపకల్పన చేస్తాం"- పవన్ కల్యాణ్

ఈ జీవితం ప్రజలకు అంకితం

"పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నాను. నాకు ఏ కోరికలు లేవు. ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలని ఆలోచన మాత్రమే" అని సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, భవిష్యత్‌లో చేయనన్నారు. పని చేయడం తప్ప తనకు మరేం తెలియదన్నారు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా భావించానని, తన జీవితం ప్రజలకే అంకితం అన్నారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్‌ అన్నారు. పాతికేళ్ల క్రితం చేసిన ఆలోచన ఐటీ వల్ల తెలుగు యువత బాగుపడ్డారన్నారు. రైతు కూలీల బిడ్డలు నేడు అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. పీ4 ఓ గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు.

"నాడు చేసిన అభివృద్ధి వల్ల నేడు తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రజలకు ఏ మంచి పనులు చేయాలనే ప్రతిరోజూ ఆలోచిస్తాను. ఇప్పుడు సాయం పొందిన వాళ్లలో అనేక మంది కోటీశ్వరులవుతారు. సమాజంలో సంపద పెరుగుతున్నా, అది పేదవారికి అందని పరిస్థితి. పేదవారిగా వారు మిగిలిపోవటానికి వీలు లేదు. సంపన్నులు వారికి మార్గదర్శకంగా ఉండి, వారిని కూడా పైకి తీసుకు రావాలి. 47 ఏళ్ళు ప్రజా సేవలో ఉన్నా.. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. 5 దశాబ్దాలుగా నన్ను ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. ఈ జీవితం ప్రజలకు అంకితం"- సీఎం చంద్రబాబు

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More