విశాఖపట్నంలో జరగనున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (APCRDA) రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడానికి సన్నాహాలు చేస్తోంది. పర్యాటకం, ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలలో ఈ పెట్టుబడులు ఉంటాయని భావిస్తున్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు అమరావతిని స్థిరమైన పట్టణ అభివృద్ధి, అంతర్జాతీయ సహకారానికి కేంద్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అమరావతి
'అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఇది అభివృద్ధి, స్థిరత్వానికి చిహ్నం. సీఐఐ సమ్మిట్లో కొత్త భాగస్వామ్యాలు అవుతున్నందున, దక్షిణ భారతదేశంలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా రాజధాని ప్రాంతం తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది.' అని ఏపీసీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు.
ఈ సమావేశంలో ఏపీసీఆర్డీఏ ప్రతినిధి బృందం అమరావతి ప్రాంతం పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, సింగిల్-విండో క్లియరెన్స్ వ్యవస్థ, పెట్టుబడిదారుల సౌకర్యాల సేవలు, పారిశ్రామిక, సేవా రంగ వృద్ధి కోసం రూపొందించిన మౌలిక సదుపాయాల గురించి ప్రదర్శిస్తుంది.
అమరావతిలో పర్యాటక, ఆతిథ్య రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ప్రముఖ కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. కృష్ణా నది ఒడ్డున ప్రీమియం హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు, నదీ తీర అభివృద్ధి, వెల్నెస్ రిసార్ట్లు ప్రతిపాదనలలో ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో, అమరావతి చుట్టూ కేంద్రీకృతమై కొత్త వైద్య సంస్థలు, మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు, టెక్ పార్కుల కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి.
'అమరావతి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుతోంది. రూ. 50,000 కోట్ల పెట్టుబడి ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం భవిష్యత్తుపై పెట్టుబడిదారులు కలిగి ఉన్న బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పెట్టుబడులు రాబోయే ఐదు సంవత్సరాలలో వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. పట్టణ సౌకర్యాలను మెరుగుపరుస్తాయి.' అని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.