ఏపీలో LRS దరఖాస్తుల గడువు పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే..?
ఏపీ ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులు చేసుకోవడానికి ఇచ్చిన గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది.
అక్రమ లేఔట్లలో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కింద దరఖాస్తులు చేసుకోవడానికి ఇచ్చిన గడువును మరో 3 నెలలు పొడిగించింది. దీంతో అర్హులైన వాళ్లు… ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకొని రాయితీలను పొందే అవకాశం ఉంటుంది.

3 నెలలపాటు పొడిగింపు…
ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన ప్రకారం.. జనవరి 23వ తేదీతో గడువు ముగిసింది. అయితే పట్టణ సంస్థలు, కార్పొరేషన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులు నేపథ్యంలో అధికారులు మరోసారి ప్రభుత్వానికి గడువు పొడిగింపు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయటంతో… మరో 3 నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హులైన వారు… ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.
ఏప్రిల్ 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వాళ్లు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లిస్తే డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీ కింద ప్లాట్ మొత్తం విలువలో 14శాతానికి బదులు7 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులకు కేటాయించిన భూములు, గ్రీన్ బఫర్ జోన్లు, తీరప్రాంత నియంత్రణ మండలి పరిధిలో ప్లాట్లు, లేఔట్లలో ఎల్ఆర్ఎస్ వర్తించదు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. నిబంధనలకు లోబడి ఉన్న ఫ్లాట్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు.
దరఖాస్తుదారులకు కావాల్సిన సమాచారం ఇచ్చే దిశగా ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా తీసుకోవచ్చింది. ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ లో సమస్యలు ఉంటే… 7981651881 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. ఈ ఫోన్ నెంబర్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. https://dtcp.ap.gov.in/LRS/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

E-Paper












