తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం - రేపు పలు సేవలు రద్దు

దీపావళి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ సందర్భంగా పలు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

Published on: Oct 19, 2025, 12:38:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన‌ దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

తిరుమల
తిరుమల

దీపావళి(అక్టోబర్ 20) నాడు ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

రేపు సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

పలు సేవ‌లు ర‌ద్దు:

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 20న క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌లు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని టీటీడీ అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

  • తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారిఆల‌యం, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యాల్లో అక్టోబ‌రు 20వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ వివరాలను కూడా టీటీడీ వెల్లడించింది.
  • శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.
  • శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు. దీపావళి సందర్భంగా సోమ‌వారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
  • కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో దీపావళి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు దీపావ‌ళి ఆస్థానం నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More