కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై త్వరలో ముఖ్యమంత్రికి ఫైనల్ రిపోర్ట్!
కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుదిదశకు చేరుకుంది. త్వరలో నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లనుంది.
ఏపీలో జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం సచివాలలో సమావేశమైంది. ఈ సమావేశంలో అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అనిత, బీసీ జనార్దన్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాలు, గ్రామల సరిహద్దుల మార్పులపై మంత్రి వర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అధ్యయనం తుది దశకు చేరుకుంది.

త్వరలోనే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ రిపోర్ట్ సీఎం చంద్రబాబుకు మంత్రి వర్గ ఉప సంఘం ఇవ్వనుంది. మదనపల్లి, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలపై ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అయితే వీటితోపాటుగా మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు మీద మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. 7,8 కొత్త జిల్లాలు కావాలని ప్రజల నుంచి వినతులు వచ్చాయి. మండలాలు, పంచాతీయలు విభజన చేయకుండానే.. నియోజకవర్గం మెుత్తం ఒకే డివిజన్లో ఉండేలా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
ఈ విషయంపై మంత్రివర్గం చాలాసేపు చర్చించింది. కానీ చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమైంది. అద్దంకి, పీలేరు, గిద్దలూరు, మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. కృష్ణా జిల్లా నుంచి నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనల మీద కూడా మంత్రి వర్గ ఉపసంఘం మాట్లాడింది. కొన్ని గ్రామాలు, మండలాల పేర్ల మార్పు మీద కూడా చర్చ జరిగింది.
త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మీద తుది నివేదిక రూపొందిస్తామని మంత్రులుతెలిపారు. పోలవరం ముంపు మండలాలను ఎందులో కలపాలి అనే అంశంపై కూడా మాట్లాడామన్నారు. తుది నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
త్వరలో తుది నివేదికను సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉప సంఘం అందజేస్తుంది. ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరిగి.. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.
రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల్లో ఏసీబీతో తనిఖీలు చేయిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రజలను నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తప్పు చేసిన వారిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.

E-Paper












