గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వస్త్రాలు, యంత్రాలు కాలీ బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మొబైల్ ఫోన్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
గుడివాడలో అగ్ని ప్రమాదం - భారీగా ఆస్తి నష్టం
గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ సమీపంలోని మొబైల్ ఫోన్ షాపులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న మరికొన్ని బట్టల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ లేదా మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలుడు వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారి తెలిపారు.
భారీగా ఆస్తి నష్టం…
సమాచారం అందుకున్న వెంటనే… అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.1.2 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని తెలిపారు.
ఎంతో దురదృష్టకరం - గుడివాడ ఎమ్మెల్యే
ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల నష్టం జరగడం ఎంతో దురదృష్టకరమన్నారు. కాంప్లెక్స్ను పరిశీలించి, దుకాణదారులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
నష్టపోయిన వ్యాపారులకు మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న సహాయాన్ని కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా సంబంధిత అన్ని శాఖల అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. గుడివాడలో భద్రతతో కూడిన అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.