కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు పరిధిలోని కోటేకల్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు.

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ కు చెందిన పలువురు మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కోటేకల్ దగ్గర ఎదురుగా వస్తున్న మరో కారు…. వీరు ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టడంతో… ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కోలార్ జిల్లాలోని చిన్న హోసపల్లికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీ లు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు. మృతి చెందిన ఐదుగురు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలియచేశారు.