ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లాడ్జి గదిలో అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, నిరంతరం వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణమైన నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.
ఆటోలు వచ్చి… సత్రంలో రూమ్ తీసుకొని

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన పల్లపు సుధాకర్ (36) అనే వ్యక్తి తన ముగ్గురు సోదరీమణులు, 15 ఏళ్ల మేనల్లుడితో కలిసి జూలై 28న శ్రీశైలం చేరుకున్నాడు. వీరంతా సుధాకర్కు చెందిన ఆటోలోనే వచ్చి…. ఓ ప్రైవేట్ సత్రంలోని గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
మంగళవారం రోజున సత్రం సిబ్బంది గది తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడం, లోపలి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా…. గదిలో ఉన్న ఐదుగురు కూడా ఉరివేసుకుని కనిపించారు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుధాకర్, అతనిద్దరు అక్కలు, చెల్లెలు, మేనల్లుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీనికితోడు సుధాకర్ పెద్ద అక్కలు ఇద్దరూ తమ భర్తల నుంచి విడిపోయి జీవిస్తున్నారు. కుటుంబంలో ఏకైక ఆధారమైన సుధాకర్ ఆటో నడుపుతూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే వీరందరినీ పోషిస్తున్నాడు.
అయితే… రోజురోజుకు పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారడం, మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఎంతకూ మెరుగుపడకపోవడంతో వీరంతా తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. జీవితంపై తీవ్ర విరక్తి చెంది, వేరే దారి లేక అందరూ కలిసి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి… అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.