Srikalahasti Road Accident : తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందురు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
అక్కిడకక్కడే నలుగురు మృతి…

ప్రాథమిక సమాచారం ప్రకారం….. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ అతివేగంగా ఉండటం, ఎదురుగా నిలిపి ఉన్న లారీని గమనించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఢీకొన్న వేగానికి అంబులెన్స్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో రోగి బంధువులు, అంబులెన్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడి అంబులెన్స్లో ఇరుక్కుపోయిన మరో ఇద్దరిని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణ చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లో డ్రైవర్తో సహా ఆరుగురు ఉన్నట్లు తెలిసింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై నిలిపి ఉంచిన లారీని గుర్తించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుల వివరాలను ఇంకా సేకరిస్తున్నారు. అప్పటివరకు క్షేమంగా ఉన్న వారు ఒక్కసారిగా మృత్యువాత పడటంతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.