హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి - నీటి విడుదలకు ముహుర్తం ఫిక్స్..!
హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరగనుంది. జీడిపల్లి రిజర్వాయర్ వరకూ నీళ్లు తరలింపు ఉండనుంది. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఈ నెల 17వ తేదీన సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు.
హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తైన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ముందు ప్రకటించినట్టుగానే వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది.

రూ.696 కోట్లతో పనులు…
రూ.696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవాఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు తాగు, సాగునీరివ్వాలన్న సంకల్పంతో రోజువారీ టార్గెట్లు నిర్ణయించి… పనులు చేపట్టారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్ధ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఫలితంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవాకాలువ విస్తరణ పనులు పూర్తి కావటంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం కలిగింది.
పెరిగిన సామర్థ్యం…
గతంలో హంద్రీనీవాఫేజ్ 1 కాలువ పూర్తి సామర్ధ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకూ 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాలువల సామర్ధ్యం 3,850 క్యూసెక్కులకు పెరగటంతో ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనీవా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని జలవనరుల శాఖ పూర్తి చేసింది.
నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా కలిగింది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల తాగు, సాగునీటి కష్టాల్ని తీర్చనున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది.
2025 ఏప్రిల్ లో మొదలైన విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తి అయ్యాయి. తదుపరి ఫేజ్- 2 పనుల్ని కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకూ నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మొత్తం రూ.3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper












