శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదిత్యుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉండటంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, పోలీసులు పలు సూచనలు చేశారు. ఉచిత, నగదు, డోనర్ దర్శనాలు సహా క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయని పేర్కొన్నారు. రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులందరికీ దర్శనం అవకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. భక్తలంతా సహకరించాలని కోరారు.

అరసవలి ఆలయంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయ ఆచారాలతో మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి మహాక్షీరాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకలను తిలకించేందుకు తరలివచ్చారు.జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని సూర్యభగవానుని ప్రార్థించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.