తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని గంటల్లో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా కు ఆరెంజ్ అలర్ట్….

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోనుంది. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, బారువ, పలాస, పాతపట్నం, టెక్కలితో పాటు వాటి పరిసర ప్రాంతాలలో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.
వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు, తాత్కాలిక షెడ్ల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్:
మరోవైపు తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం…. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీస్తాయి. రాబోయే మూడు రోజుల పాటు ఈ ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.