పెట్టుబడులు పెట్టండి.. గ్లోబల్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఏపీ గేట్వే : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది ఒక గేట్వే అవుతుందని చెప్పారు.
విశాఖలో నవంబర్ 14, 15వ తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖ వచ్చారు. నోవాటెల్లో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఏపీ గేట్ వే అవుతుందని చంద్రబాబు చెప్పారు.

కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేయడం వలన సౌలభ్యం, వేగం, ఖర్చు కలిసి వస్తుందని చెప్పారు. 'వివిధ రంగాలలో అపారమైన అవకాశాలతో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అనుకూలంగా ఉంటుంది. ప్రోత్సాహకాలు, వేగవంతమైన వ్యాపార అనుమతులు ఇవ్వడంలో ఏపీకి పోటీ లేదు.' అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వస్తువుల తయారీ, ఆరోగ్య సంరక్షణ, విద్యా, పర్యాటక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలలో అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో కూడా రాష్ట్రం ముందుందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.
'ఏపీలో పోర్టులతోపాటుగా రైల్వే అనుసంధానికి ప్రయత్నం చేస్తున్నాం. నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉంది. వినూత్న ఆవిష్కరణలు చేయడంలో ముందుగా ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. అనుమతుల్లో ఎటువంటి జాప్యం ఉండదు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తాం. ఏపీలో వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకొస్తున్నాం. డ్రోన్ సిటీని ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. స్పేస్ సిటీని కూడా ఏర్పాటు చేస్తాం. రవాణా రంగంలో పెద్ద ఎత్తున పోర్టులు నిర్మిస్తున్నాం.' అని చంద్రబాబు వెల్లడించారు.
విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని చంద్రబాబు అన్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అందిపుచ్చుకుంటున్నామన్నారు. ఐటీలో భారతీయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. మరోవైపు గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దానికి అనుగుణంగా 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.













