'వందే భారత్' ప్రయాణికులకు శుభవార్త - ఇకపై ఈ స్టేషన్ లోనూ హాల్టింగ్, ఇవిగో వివరాలు

ఏపీలోని రైలు ప్రయాణికులకు మరో శుభవార్త వచ్చేసింది. యశ్వంత్‌పూర్ కాచిగూడ వందేభారత్ రైలు ఇకపై హిందూపురం రైల్వేస్టేషన్‌లోనూ ఆగనుంది. ఈ నిర్ణయం  డిసెంబర్ 27 నుంచే అమల్లోకి వచ్చింది.  ఈ మేరకు వందేభారత్ రైలుకు హిందూపురంలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

Published on: Dec 28, 2025, 06:37:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వందే భారత్ ట్రైన్ సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఇటీవలనే ఏపీలోని నర్సాపురం వరకు ట్రైన్ సేవలను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ మరో శుభవార్తను అందించింది.కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ఇక నుంచి హిందూపూర్‌లో కూడా ఆగనుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

హిందూపురంలో వందే భారత్ ట్రైన్ కు హాల్టింగ్
హిందూపురంలో వందే భారత్ ట్రైన్ కు హాల్టింగ్

కాచిగూడ–యశ్వంత్‌పూర్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 గంటలకు హిందూపూర్ చేరుకుని 12.10 గంటలకు బయల్దేరనుంది. అంటే 2 నిమిషాలపాటు ఈ స్టేషన్ లో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్‌లో రైలు నెంబర్ 20704(యశ్వంత్‌పూర్–కాచిగూడ) మధ్యాహ్నం 3.48 నుంచి 3.50 గంటల వరకు ఆగుతుంది. ఈ హాల్టింగ్ సౌకర్యంతో…. హిందూపూర్ ప్రాంతంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించటమే లక్ష్యమని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఉండదు. ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి.. కాచిగూడ రాత్రి 11 గంటలకు చేరుతుంది.

ఈ ట్రైన్ మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. హిందూపురంలో స్టాప్ రావటంతో స్థానిక ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

ఈ రూట్ లో డైలీ ప్యాసింజర్ ట్రైన్:

ఇక గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానుంది .ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ ట్రైన్ సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

గుంతకల్లు - మార్కాపుర్ (ట్రైన్ నెబంర్ 57407) మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు… సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి… రాత్రి 11.30 గంటలకు మార్కాపుర్ రోడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.

అంతేకాకుండా మార్కాపుర్ రోడ్ నుంచి గుంతకల్లుకు (ట్రైన్ నెంబర్ 57408) మధ్య ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇది మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30కు గుంతకల్లుకు చేరుకోనుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగనుంది.

ఈ డైలీ ప్యాసింజర్ రైళ్లు…. మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More