కాకినాడ బాలిక మిస్సింగ్ కేసు : పెంపుడు కుక్క మృతి - ఇంకా ఆచూకీపై వీడని ఉత్కంఠ...!

కాకినాడ జిల్లా సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 8 రోజులు దాటింది. కేసు ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు…. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి క్లూస్ కోసం వెతికారు.  దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన పెంపుడు కుక్క శనివారం నాడు హఠాత్తుగా మృతి చెందింది. 

Published on: Jun 13, 2026, 15:42:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kakinada Jahnavi Missing Case Updates : కాకినాడ జిల్లా సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 8 రోజులు దాటింది. అయితే ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క శనివారం నాడు హఠాత్తుగా మృతి చెందింది. ఈ ఘటనతో అటు పోలీసులు, ఇటు బాలిక తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిన్నారి ఆచూకీ చెబుతుందనుకున్న మూగజీవం అనారోగ్యంతో కన్నుమూయడంతో కేసు దర్యాప్తుపై సందిగ్ధత నెలకొంది.

Kakinada Jahnavi Missing Case (Gemini AI Image)
Kakinada Jahnavi Missing Case (Gemini AI Image)

ఈనెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరి ఇల్లు దాటి బయటకు వెళ్లిన సమయంలో ఈ పెంపుడు కుక్క కూడా ఆమెతో పాటే వెళ్ళింది. వారం రోజుల క్రితం చిన్నారితో పాటే మిస్ అయిన ఈ కుక్క…. నాలుగు రోజుల క్రితం ఒంటిపై గాయాలతో ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ మూగజీవం గతానికి భిన్నంగా ప్రవర్తించింది. విపరీతంగా అరుస్తూ, కరుస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేసింది. శనివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురై ఆ కుక్క ప్రాణాలు విడిచింది.

జీపీఎస్ తో ప్రయత్నాలు..!

నిజానికి ఈ కుక్క ప్రవర్తనను గమనించిన పోలీసులు…. దీని ద్వారా పాప ఆచూకీ కనుగొనవచ్చని భావించారు. ఇందులో భాగంగానే నిన్న పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి బాలిక కోసం పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. జీపీఎస్ అమర్చిన తర్వాత ఆ కుక్క దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రయాణించి మళ్లీ ఇంటికే తిరిగి వచ్చింది. నిన్న సాయంత్రం వరకు ఇంటి వద్దే తిరుగుతూ చిన్నారి కోసం వెతికిన కుక్క… ఇవాళ ఉదయానికి మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కుక్క మృతి చెందడానికి ముందు, దానికి పాప ఫోటో చూపించి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసును కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి స్వయంగా అంత దూరం వెళ్లే వయసు లేదు కాబట్టి, కచ్చితంగా మనుషులే ఏదైనా చేసి ఉంటారని గట్టిగా అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు చిన్నారికి సంబంధించిన మృతదేహం గానీ, ఎలాంటి కీలక ఆధారాలు గానీ లభించకపోవడంతో ఆమె బతికే ఉందనే ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లి ఉంటే, ఆమె సురక్షితంగా తిరిగొస్తుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More