Kanipakam Brahmotsavam 2026 : చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు.
ఈనెల 14 నుంచి బ్రహ్మోత్సవాలు….

ఈ నెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పూతలపట్టు శాసనసభ్యుడు మురళీ మోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కాణిపాకం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ సురేంద్రబాబు తదితరులు ఉన్నారు.
సచివాలయానికి వచ్చిన ఆలయ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి చిత్రపటాన్ని, స్వామివారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను ముఖ్యమంత్రికి బహూకరించారు.
21 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు
ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాకంలో 21 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఉత్సవాలకు ముఖ్యమంత్రి రాక పట్ల ఆలయ యంత్రాంగం ఆశాభావంతో ఉందని ప్రతినిధులు వెల్లడించారు.