Andhra Pradesh Heavy Rains Alert : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో క్రమంగా తీవ్రరూపం దాల్చి రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ అల్పపీడనం రోజురోజుకు బలపడుతూ…. సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాతి రోజే, అంటే మంగళవారం నాటికి ఇది మరింత తీవ్రమై 'తీవ్రవాయుగుండం'గా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తీవ్రవాయుగుండం బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేసింది.
భారీ వర్ష సూచన….
ఈ అల్పపీడనం మరియు తీవ్రవాయుగుండం ప్రభావంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా ధారాపాతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు భారీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం(నేటి) నుంచే రాష్ట్రమంతటా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి, అనేక చోట్ల విస్తారంగా వర్షాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పుల నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. సముద్రం తీవ్ర అలజడిగా మారనున్నందున…. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని ఖచ్చితమైన ఆంక్షలు విధించింది. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన వేటగాళ్లు తక్షణమే సమీప తీరాలకు తిరిగిరావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.