కర్నూలు : బ్యాడ్మింటన్ మ్యాచ్ లో ఓటమి - తుపాకీతో కాల్పులు…!
కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ సెమీఫైనల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి లైసెన్స్డ్ పిస్టల్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆటల్లో గెలుపోటములు సహజం… గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలి. కానీ అలా కాకుండా… తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడో వ్యక్తి. బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో తన జట్టు ఓడిపోయిందన్న నిరాశతో… ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్తో ఏకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది.

కోపాన్ని తట్టుకోలేక కాల్పులు….
కర్నూలు నగరంలోని స్థానిక బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా గత నాలుగు వారాలుగా 'కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్' (KBPL) పోటీలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో 'అనన్య' ఫ్రాంచైజీ జట్టు ఓటమి పాలైంది. ఈ జట్టులో కౌశిక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సభ్యుడిగా ఉన్నాడు.
మ్యాచ్ ఓడిపోయామన్న నిరాశ, కోపాన్ని తట్టుకోలేకపోయిన కౌశిక్… ఆదివారం సాయంత్రం అకాడమీ ప్రాంగణం వెలుపలకు వచ్చి తన వద్ద ఉన్న రివాల్వర్తో భూమిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. హఠాత్తుగా పెద్ద శబ్దంతో కాల్పులు జరగడంతో అక్కడ ఉన్న క్రీడాకారులు, నిర్వాహకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కేసు నమోదు…
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కర్నూలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రాఘవేంద్ర మీడియాకు వెల్లడించారు. "కౌశిక్ వద్ద చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్న .32 రివాల్వర్ ఉంది. ఉదయం జరిగిన సెమీఫైనల్స్ లో తన జట్టు ఓడిపోవడంతో తీవ్ర తీవ్ర నిరాశ, శత్రుత్వ భావనతోనే అతడు ఈ విధంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న తుపాకీతో నేలపైకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు," అని డీఎస్పీ స్పష్టం చేశారు.
నిందితుడు కౌశిక్ను ఇప్పటికే పోలీసు అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. ఆత్మరక్షణ కోసం కొన్నేళ్ల క్రితం కౌశిక్ ఈ ఆయుధ లైసెన్స్ పొందాడని, ఇప్పటికీ అది చెల్లుబాటులోనే ఉందని విచారణలో తేలింది. అయితే… బహిరంగ ప్రదేశంలో ఈ రకంగా అకారణంగా కాల్పులు జరిపి ప్రజలను భయాందోళనకు గురిచేసి, నిబంధనలను ఉల్లంఘించినందున అతడి ఆయుధ లైసెన్స్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు సిఫార్సు లేఖ పంపుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఈ ఘటన జరగడానికి ముందు అక్కడ ఎలాంటి ఘర్షణ గానీ, తోపులాట గానీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం మ్యాచ్ ఓడిపోయామన్న కోపం, ఆవేశం తప్ప ఈ ఘటన వెనుక ఎలాంటి ఇతర గొడవలు లేవని ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. టోర్నీలో పాల్గొన్న అనన్య ఫ్రాంచైజీలో కౌశిక్ కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే ఉన్నాడని, జట్టు కెప్టెన్ కాదని పోలీసులు స్పష్టం చేశారు. క్రీడా ప్రాంగణాల్లో ఇటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించడంపై క్రీడాభిమానులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

