పునర్వికకు పునర్జన్మ…! చిన్నారి ప్రాణం కాపాడేందుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ - అండగా నిలించిన నారా లోకేశ్
అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన ఓ చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.16 కోట్ల 'జోల్జెన్స్మా' (Zolgensma) ఇంజెక్షన్ను శనివారం అందించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో నిధుల కొరత తీరడమే కాకుండా…. అమెరికా నుంచి ఈ మందును రప్పించే ప్రక్రియ వేగవంతమైంది.
కొన్ని నెలల క్రితం మీడియా- సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ``సేవ్ పునర్విక.. పునర్వికను కాపాడుకుందాం..`` అంటూ లక్షల హృదయాలు స్పందించాయి. చేతనైన సాయం చేశాయి. చేయలేని వారు ప్రార్థించారు. ఇంజెక్షన్ కోసం వెల్లువలా విరాళాలు వచ్చాయి. ఇంకా చిన్నారి చిరునవ్వులు వెలగాలంటే 6 కోట్లు కావాలి…. అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ ఆపన్నహస్తం అందించారు. ఇంకా ఎంత అవసరమైతే అంతా తానే సమీకరిస్తానని, అన్ని విధాలా అండగా ఉంటానని పునర్విక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ చిన్నారి చిరునవ్వుల కోసం అన్నీ తానై వ్యవహరించిన నారా లోకేష్. పునర్వికకు పునర్జన్మను ప్రసాదించే చికిత్సకు సాయం అందించారు. విదేశాల నుంచి రూ.16 కోట్ల ఇంజెక్షన్ తెప్పించేందుకు సహకరించారు. ఇంజెక్షన్ వేసేటప్పుడు చిన్నారి పునర్విక చెంతనే ఉన్నారు. సాయం అందించిన లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి.
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ(SMA TYPE-1) వ్యాధితో పునర్విక బాధపడుతోంది. ఇంజెక్షన్ ను అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చేసిన సాయంతో పునర్విక ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో ఇవాళ ఉదయం మంత్రి నారా లోకేష్ సమక్షంలో వైద్యులు అమెరికా నుంచి తీసుకువచ్చిన జోల్ జెన్ స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను చిన్నారికి ఇచ్చారు. అనంతరం మంత్రి లోకేష్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో కొద్దిసేపు ఎత్తుకుని లాలించారు. చిన్నారిని కాపాడటం తన బాధ్యత అని, అన్ని విధాలా అండగా ఉంటానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణాలు కాపాడుకోగలిగామని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే మార్గం….
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తండ్రి జంపాల మంగళ సురేష్ కుమార్ క్షవర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పునర్విక జన్మించి ఆరు నెలలలైనా శరీరం కదిలించకపోవడంతో కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కర్నూలు వైద్యుల సలహా మేరకు చిన్నారిని హైదరాబాద్ లోని రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పునర్వికకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ సోకిందని, చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా అనే ఒకసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ అని వైద్యులు తెలిపారు.
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పావతి ఈ ఏడాది జనవరి నుంచి దాతల సాయం కోరారు. పునర్వికను కాపాడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిఒక్కరూ స్పందించి మానవత్వం చాటుకున్నారు. ఫిబ్రవరి నాటికి విరాళాల ద్వారా రూ.10 కోట్ల వరకు సమకూరాయి. సాయం కోసం ఎక్స్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. ఆపదలో అండగా నిలిచే మంత్రి నారా లోకేష్.. పునర్విక ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే స్పందించారు. పునర్విక బాధ్యత తీసుకుంటానని, చిన్నారిని కాపాడతామని హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
నిరంతర పర్యవేక్షణ….
అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్కు రప్పించే పనిని తన సిబ్బంది ద్వారా నిరంతరం లోకేష్ పర్యవేక్షించారు. ప్రముఖ ఔషధ కంపెనీ నోవార్టీస్, రెయిన్ బో ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులను సమన్వయ పరిచారు. వైద్య పత్రాలు, ఒప్పందాలు పూర్తిచేయడం, ప్రభుత్వ ధృవపత్రాలు, వినతులు తయారీ, చెల్లింపులు, రవాణా అంశాల్లో సహాయ సహకారాలు అందించారు. పునర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో నిండు ప్రాణాలు నిలిచాయి.
తాము పునర్వికకు జన్మనిస్తే.. మంత్రి నారా లోకేష్, మానవతాహృదయాల స్పందనతో పునర్జన్మ లభించిందని తల్లిదండ్రులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని భావోద్వేగంతో చెప్పారు. తమ చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు సహాయం అందించడమే కాకుండా, భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

