రాజధాని అమరావతి లో 30 శాతం గ్రీనరీకే ప్రాధాన్యం ఇస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. 133.3కి.మీల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకనుగుణంగానే వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు.
ఆలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి - మంత్రి నారాయణ

బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన… శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 22 రోడ్లలో రెండు వైపులా బఫర్ జోన్ లో గ్రీనరి అభివృద్ధి జరుగుతోందన్నారు. రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు. ఇంకా 2168 మంది రైతులకు 7743 ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.
రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని రైతులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. భూములుచ్చిన రైతులకు ఇంకా 719 ఎకరాల మేర ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు. 29 గ్రామాల పరిధిలో భూసమీకరణకు సహకరించని రైతుల్ని ఇవాళ్టికీ విజ్ఞప్తి చేస్తున్నామని… రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళ్తామని స్పష్టం చేశారు. సీఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మరోవైపు మరో విడత భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చి.. భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు.