Papikondalu Boating Stopped: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులకు అధికారులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. గోదావరి నదిలో ప్రయాణించే పర్యాటక బోట్ల నిర్వహణ, ప్రయాణికుల రక్షణపై తీవ్ర భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఇటీవలనే దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయ విహారయాత్ర రేవు నుంచి ఒక ప్రైవేట్ పర్యాటక బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. అయితే…. ఆ బోటు దేవీపట్నం పాత పోలీసుస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సరికి హఠాత్తుగా ఇంజిన్లో తీవ్ర సాంకేతిక లోపం ఏర్పడింది. నడి నదిలో బోటు ఆగిపోవడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన బోటు సరంగు (డ్రైవర్) వెంటనే అప్రమత్తమై, నది ఒడ్డున సురక్షిత ప్రాంతానికి బోటును నిలిపివేయడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది.
ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి..
ఈ ఘటను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గోదావరిలో తిరిగే అన్ని రకాల పర్యాటక బోట్ల ఫిట్నెస్ (కండిషన్), ప్రభుత్వం నిర్దేశించిన అత్యవసర రక్షణ, భద్రతా ప్రమాణాలు (లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక పరికరాలు మొదలైనవి) సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తున్నారు.
"ప్రస్తుతం ఉన్న అన్ని బోట్ల రక్షణ ప్రమాణాలపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ తనిఖీల నివేదిక పూర్తిగా చేతికి వచ్చిన తర్వాతే, భద్రతా నియమాలు పాటించే బోట్లకు మాత్రమే తిరిగి పాపికొండల యాత్రకు అనుమతులు ఇస్తాం" అని రంపచోడవరం ఆర్డీవో స్వాతి స్పష్టం చేశారు. పర్యాటకుల ప్రాణాలతో ఆటాడి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే బోటు యజమానులపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బోట్ల తనిఖీలు పూర్తయ్యే వరకు పర్యాటకులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.