Papikondalu Boating Stopped : పాపికొండల విహారయాత్ర నిలిపివేత - కారణం ఇదే!

Papikondalu Boating Stopped: గోదావరి నదిలో పర్యాటక బోట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీవో స్వాతి సంచలన ప్రకటన చేశారు.

Published on: Jun 14, 2026, 09:47:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Papikondalu Boating Stopped: రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులకు అధికారులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. గోదావరి నదిలో ప్రయాణించే పర్యాటక బోట్ల నిర్వహణ, ప్రయాణికుల రక్షణపై తీవ్ర భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

పాపికొండలు
పాపికొండలు

ఇటీవలనే దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయ విహారయాత్ర రేవు నుంచి ఒక ప్రైవేట్ పర్యాటక బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. అయితే…. ఆ బోటు దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి చేరుకునే సరికి హఠాత్తుగా ఇంజిన్‌లో తీవ్ర సాంకేతిక లోపం ఏర్పడింది. నడి నదిలో బోటు ఆగిపోవడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన బోటు సరంగు (డ్రైవర్) వెంటనే అప్రమత్తమై, నది ఒడ్డున సురక్షిత ప్రాంతానికి బోటును నిలిపివేయడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది.

ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి..

ఈ ఘటను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గోదావరిలో తిరిగే అన్ని రకాల పర్యాటక బోట్ల ఫిట్‌నెస్ (కండిషన్), ప్రభుత్వం నిర్దేశించిన అత్యవసర రక్షణ, భద్రతా ప్రమాణాలు (లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక పరికరాలు మొదలైనవి) సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తున్నారు.

"ప్రస్తుతం ఉన్న అన్ని బోట్ల రక్షణ ప్రమాణాలపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ తనిఖీల నివేదిక పూర్తిగా చేతికి వచ్చిన తర్వాతే, భద్రతా నియమాలు పాటించే బోట్లకు మాత్రమే తిరిగి పాపికొండల యాత్రకు అనుమతులు ఇస్తాం" అని రంపచోడవరం ఆర్డీవో స్వాతి స్పష్టం చేశారు. పర్యాటకుల ప్రాణాలతో ఆటాడి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే బోటు యజమానులపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బోట్ల తనిఖీలు పూర్తయ్యే వరకు పర్యాటకులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More