AP Hundi ₹20 Note Viral : సాధారణంగా భక్తులు దేవుడికి మొక్కుబడులు చెల్లించుకోవడానికి, తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ గుడిలోని హుండీల్లో కానుకలు వేస్తుంటారు. మంచి ఉద్యోగం రావాలని…. ఆరోగ్యం బాగుండాలని, పెళ్లి కావాలనో లేదా వ్యాపారంలో లాభాలు రావాలనో కోరుకుంటూ హుండీల్లో డబ్బులు వేయడం మనం ఎప్పుడూ చూసేదే. కానీ అనంతపురం జిల్లాలోని ఓ ఆలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసేలా వింత ఘటన వెలుగు చూసింది. "మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామి," అంటూ ఒక రూ. 20 కరెన్సీ నోటుపై రాసి ఉన్న లేఖ ఆలయ సిబ్బందిని, భక్తులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.
రూ. 20 నోటుపై రాసి…

ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ ఘటన అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది కలిసి హుండీలోని కానుకలను లెక్కిస్తున్న సమయంలో ఈ వింత నోటు వారి కంటపడింది. భక్తులు సమర్పించిన నోట్ల కట్టలను విడదీసి చూస్తున్న క్రమంలో ఒక చోట చేతిరాతతో రాసి ఉన్న ఇరవై రూపాయల నోటు కనిపించింది. దానిపై ఉన్న అక్షరాలను చదివిన అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఆ నోటుపై చాలా బాధతో, వేడుకుంటున్నట్లుగా ఒక సందేశాన్ని రాశారు. "స్వామి…. నా అత్త పెట్టే వేధింపులను నేను ఇక ఏమాత్రం భరించలేకపోతున్నాను. దయచేసి ఆమె త్వరగా చనిపోయేలా చూడు," అని ఆ నోటుపై రాసి ఉంది. ఈ వింత కోరికను చూసి అక్కడున్న ఆలయ సిబ్బంది, అధికారులు కాసేపు లెక్కింపు ఆపేసి ఆ నోటును పదే పదే చదివారు. ఈ వింత మొక్కు చూసి కొందరు నవ్వుకోగా, మరికొందరు మాత్రం ఆ కుటుంబంలో ఉన్న తీవ్రమైన విభేదాలు, పగను చూసి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ హుండీ నోటుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుండటంతో స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.