అవినీతి కేసుల్లో నమోదైన కొన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఎఫ్ఐఆర్లను రద్దు చేయడానికి హైకోర్టు "అనవసరమైన శ్రమ" తీసుకుందంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లు కొట్టేయడం కుదరదని తేల్చి చెప్పింది. రద్దు చేసిన ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుంద్రేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
గత ఏడాది ఆగస్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పాటు పలువురు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించిస్తూ… తీర్పును వెలువరించింది."మా అభిప్రాయం ప్రకారం… హైకోర్టు విధానం న్యాయాన్ని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు. హైపర్ టెక్నికల్ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్లను కొట్టివేయటం సరికాదు. చట్టం యొక్క ప్రాథమిక నియమాలకు విరుద్ధం" అని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 2(ఎస్)ను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు… పలు ఎఫ్ఐఆర్లను కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్లపై 6 నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కోరింది.
ఆయా కేసుల్లో ప్రతివాదులుగా ఉన్నవారు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లపై, పెండింగ్లో ఉన్న దర్యాప్తులపై ఎలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) తర్వాత చట్టాలను మార్చకుంటే పాత చట్టాలు అమల్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.