అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులను మృత్యువు కబళించింది. మత్స్యగెడ్డ వాగులో నీట మునిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రాథమిక వివరాల ప్రకారం… పన్నెడా గ్రామానికి చెందిన నలుగురు బాలురు మత్స్యగెడ్డ వాగుకు వెళ్లారు. చేపలు పట్టడంతో పాటు ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ ప్రాణలు కోల్పోయారు.
హర్షిత్ (12), ప్రదీప్ (11), పాంగి బబులు (10)గా మృతులుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూళ్లకు వెళ్తూ… కళ్లముందే తిరిగే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకేసారి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి చెందడంతో గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు చూసి స్థానికులు కన్నీరు ఆపుకోలేకపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేసవి వేళ స్థానికంగా ఉండే వాగులు, చెరువులు, కుంటలకు వెళ్లేందుకు వెళ్తుంటారు. అయితే ఈత రాకపోవటం లేదా లోతును సరిగా అంచనా వేయకపోవటం వంటి కారణాలతో… ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటీవలే కాలంలో చాలా చోట్ల ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ముఖ్యంగా చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.