తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. సిట్ ఎదుట ధర్మారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు!
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణను వేగవంతం చేస్తోంది. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. చాలా సేపు ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారించారు. బుధవారం కూడా టీటీడీ మాజీ ఈవోను విచారించే అవకాశాలు ఉన్నాయి.

వైసీపీ హయాంలో ఈవోగా ఉన్న సమయంలో భారీ మెుత్తంలో కల్తీ నెయ్యి లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ధర్మారెడ్డికి సిట్ ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ధర్మారెడ్డి పదవి కాలంలో టెండర్లు, సరఫరా, రిపోర్టుల గురించి అధికారులు అడిగారు. సిట్ విచారణ నుంచి ధర్మారెడ్డి బయటకు వెళ్లారు. అయితే ఈ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ ఆయనకు తిరుపతి లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ధర్మారెడ్డి తీసుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన కుదరకపోతే.. 15వ తేదీన హాజరు అవుతానని సమాధానం ఇచ్చారు సుబ్బారెడ్డి. కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి అని తేలినా.. పట్టించుకోలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సుబ్బారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించే దిశగా కూడా సిట్ అడుగులు వేస్తోంది.
లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. ఉత్తరాఖండ్కు చెందిన పాల సంస్థ 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లపాటు టీటీడీకి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు తర్వాత సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం వివరాలను సేకరించింది.
టీటీడీకి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేసే భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి సుగంధ్ మోనోడిగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను సరఫరా చేశారు. వీటితోనే నెయ్యిని తయారు చేశారని సీబీఐ గుర్తించింది. 2022లో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీని అనర్హులుగా ప్రకటించి, నెయ్యి సరఫరా చేయకుండా బ్లాక్ లిస్ట్ చేశారు. అయితే డెయిరీ ఇతర డెయిరీల ద్వారా కాంట్రాక్టుల కోసం బిడ్డింగ్ చేయడం ద్వారా తిరుపతి ఆలయ ట్రస్ట్కు కల్తీ నెయ్యిని సరఫరా చేసింది . వీటిలో తిరుపతిలోని వైష్ణవి డెయిరీ, యూపీకి చెందిన మాల్ గంగా, తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేశారు.













