టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం!
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరగనుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
వాహన సేవల వివరాలు, సమయం
పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలలో విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
17-11-2025 (సోమవారం)-ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం)-చిన్నశేషవాహనం, 18-11-2025 (మంగళ వారం) -పెద్దశేషవాహనం-హంసవాహనం, 19-11-2025 (బుధవారం)-ముత్యపుపందిరి వాహనం-సింహవాహనం, 20 -11-2025 (గురువారం)-కల్పవృక్ష వాహనం-హనుమంత వాహనం, 21 -11-2025 (శుక్ర వారం)-పల్లకీ ఉత్సవం-గజవాహనం, 22-11-2025 (శనివారం)-సర్వభూపాలవాహనం-స్వర్ణరథం-గరుడవాహనం, 23-11-2025 (ఆదివారం)-సూర్యప్రభ వాహనం-చంద్రప్రభ వాహనం, 24-11-2025 (సోమవారం)-రథోత్సవం-అశ్వ వాహనం, 25-11-2025 (మంగళవారం)-పంచమీతీర్థం-ధ్వజావరోహణం., నవంబర్ 26నపుష్పయాగం ఉంటుంది.
పరదాలు బహుకరణ
హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలను, అదేవిధంగా తిరుపతికి చెందిన మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.













