కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ - ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
వైఎస్సార్ కడప జిల్లా పుల్లంపేట వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక చిన్నారి, ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా… మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్సార్ కడప జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పుల్లంపేట మండల పరిధిలో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కి చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు….. ఒక లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ఒక చిన్నారితో పాటు ఒక విద్యార్థి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు, సోమవారం తెల్లవారుజామున 1:00 గంట నుంచి 1:15 గంటల మధ్య సమయంలో పుల్లంపేట సమీపంలోని ఉడుమువారిపల్లి గ్రామం వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా కడప వైపు నుంచి వస్తున్న ఒక లోడెడ్ లారీ, బస్సును బలంగా ఢీకొట్టింది.
రెండు వాహనాలు అతివేగంతో ఢీకొనడంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. లారీ బస్సు కుడివైపు భాగాన్ని బలంగా తాకడంతో, బస్సు లోపల కుడివైపున ఉన్న సుమారు ఆరు సీట్లు పూర్తిగా నలిగిపోయాయి. ఈ సీట్లలో కూర్చున్న ప్రయాణికులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయాలపాలు కావడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు.
క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, హైవే సిబ్బంది సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 16 మంది ప్రయాణికులను తక్షణమే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఇతర వైద్య శాలలకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మంత్రి ఆదేశాలు…
కడప జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆయన నిరంతరం సమాచారం సేకరిస్తున్నారు.
గాయపడిన వారికి అత్యంత నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు (హైయర్ మెడికల్ సెంటర్స్) తరలించాలని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, రోడ్డు భద్రతా చర్యల లోపాలు, ప్రమాదానికి గురైన బస్సు, లారీలకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని అధికారులను కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

