'డిజిటల్ అరెస్ట్'… గత కొంతకాలంగా ఈ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా… చాలా మంది సైబర్ మోసగాళ్ల వలలో చికిపోతున్నారు. వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈజీగా కొట్టేస్తున్నారు. ఇందుకోసం అనేక రకాల పేర్లు వాడేస్తున్నారు. ఇదే మాదిరిగా కాంబోడియా దేశాన్ని అడ్డాగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఓ ముఠా దందా సాగిస్తోంది. ఈ సైబర్ నేరాల ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు.

భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు మాట్లాడుతూ తాము సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమని పరిచయం చేసుకున్నారు. సిమ్ కార్డులో తేడాలున్నాయని అని చెబుతూ నమ్మబలికారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయాందోళనకు గురి చేశారు. దీంతో టెన్షన్ కు గురైన సదరు వ్యక్తి…. అతని బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలను చెప్పాడు. ఏకంగా 78 లక్షల రూపాయలను తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. మోసపోయానని గ్రహించిన అతను… భీమవరం పోలీసులను ఆశ్రయించాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ మాట్లాడుతూ… నవంబర్ 17న బెంగళూరు పోలీసు అధికారులుగా నటించిన స్కామర్లు చేసిన వాట్సాప్ కాల్స్ ద్వారా ఈ మోసం జరిగిందని తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.78.6 లక్షలు వారి ఖాతాలోకి మళ్లించుకున్నారని పేర్కొన్నారు.
భీమవరం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడగా…. నిందితుల కోసం వేట ప్రారంభించారు. నిందితులు కార్డ్ డీల్ అనే కొత్త పద్ధతి ద్వారా నగదును మళ్లించినట్లు గుర్తించారు. ఈ ముఠాకు కాంబోడియా దేశంతో లింకులు ఉన్నట్లు తేలింది. మొత్తం 14 మందిని నిందితులుగా గుర్తించగా…. వీరిని గన్నవరం, విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేశారు. రూ.42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సిమ్ కార్డులు, బ్యాంకు పత్రాలు, పాస్ పోర్ట్లు, టెలిగ్రామ్ ఆధారిత డిజిటల్ సాక్ష్యాలతో కూడిన 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముంబైకి చెందిన రహతే జె నయన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.