YS Jagan Demands Nara Lokesh Resignation : రాష్ట్రంలో డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని జగన్ గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వంలో ఇది నైతికతకు, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపిన ఆ నైతిక ప్రమాణాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందో లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
రాజీనామాపై లోకేశ్ కు వైఎస్ జగన్ ప్రశ్న…
ఆంధ్రప్రదేశ్లో సుమారు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థులు డీఎస్సీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతమంది అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ డీఎస్సీ నిర్వహణలో అంతులేని అక్రమాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా..? అని నిలదీశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైఖరిని కూడా వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ విలువలు, ప్రమాణాలు మరియు జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ…. సీఎం చంద్రబాబు తన కుమారుడి పదవిని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారా అని ప్రశ్నించారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని… ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.