Aakali Rajyam OTT Review: ఆకలి రాజ్యం 2026 రివ్యూ- నిరుద్యోగుల కష్టాలపై ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు సిరీస్ ఎలా ఉందంటే?
Aakali Rajyam 2026 Review And Rating In Telugu: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో సోషల్ సెటైరికల్ కామెడీ ఎమోషనల్ డ్రామా వెబ్ సిరీస్ ఆకలి రాజ్యం రిలీజ్ అయింది. ఇప్పటికీ నిరుద్యోగ సమస్య ఎలా ఉందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఆకలి రాజ్యం ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.
Aakali Rajyam 2026 Review In Telugu And Rating: 1980వ సంవత్సరంలో దర్శకదిగ్గజం కే.బాలచందర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆకలి రాజ్యం’ సినిమా నాటి నిరుద్యోగుల గుండె చప్పుడుగా నిలిచింది. సరిగ్గా 45 ఏళ్ల తర్వాత, అదే సమస్యను నేటి ఐటీ విప్లవం, యూత్ లైఫ్స్టైల్ నేపథ్యానికి ముడిపెడుతూ 'ఆకలి రాజ్యం 2026' పేరుతో కొత్త ఓటీటీ సిరీస్ను తీసుకొచ్చారు.

ఆకలి రాజ్యం 2026 వెబ్ సిరీస్కు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. తెలుగు సోషల్ సెటైరికల్ కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఆకలి రాజ్యం 2026 ఓటీటీ సిరీస్లో వికాస్ వశిష్ఠ, గీతా సైనీ, రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.
ఆకలి రాజ్యం రివ్యూ
నేటికి తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఎలా ఉందనే కాన్సెప్టుతో వచ్చిన ఆకలి రాజ్యం 2026 ఆహాలో ఇవాళ (ఆగస్టు 28) ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతానికి 3 ఎపిసోడ్లతో ఆకలి రాజ్యం 2026 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఆకలి రాజ్యం 2026 ఓటీటీ రివ్యూలో చూద్దాం.
కథ:
హైదరాబాద్లో ఒకే గదిలో అద్దెకుంటూ ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమించే ముగ్గురు ఇంజినీరింగ్ స్నేహితుల కథ ఇది. రమేశ్ (వికాస్ వశిష్ఠ), అరుణ (గీతా సైనీ), అక్షయ్ (రాజేశ్ ఖన్నా) చదువు పూర్తి చేసుకుని ఏళ్లు గడుస్తున్నా సరైన ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సొంతంగా ఏదైనా స్టార్టప్ లేదా వ్యాపారం ప్రారంభించాలనే తపన ఉంటుంది.
కానీ, గడప దాటితే ఎదురయ్యే ఆర్థిక, కుటుంబ సమస్యలు వీరిని వేధిస్తుంటాయి. ఈ నిస్సహాయ పరిస్థితుల నుంచి ఈ ముగ్గురు బయటపడ్డారా? లేదా? అనుకుంది సాధించారా? ఉద్యోగ జీవితాలు ఎలా ఉన్నాయి? అన్నదే ఆకలి రాజ్యం ఓటీటీ సిరీస్ కథ.
విశ్లేషణ:
ఈ రోజుల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం దొరక్క హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో సగటు యువత పడే అవస్థలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. సీరియస్ పాయింట్ను సైతం కాస్త వినోదాత్మకంగా మలచడంలో సక్సెస్ అయ్యారు.
కామెడీతో మొదలై.. ఎమోషన్తో ముగిసి!
మొదటి రెండు ఎపిసోడ్లు నవ్వులు పూయించగా, మూడో ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుల మనసును ఎమోషనల్గా తాకుతుంది. ప్రతి ఎపిసోడ్ సుమారు 35 నిమిషాల నిడివితో సాగుతుంది. హైదరాబాద్లోని రియల్ లొకేషన్స్లో షూటింగ్ చేయడం వల్ల నిజ జీవితానికి చాలా దగ్గరిగా అనిపిస్తుంది. మన చుట్టు ఉండే యూత్ ఇలా కష్టాలు పడుతున్నారనే భావన కలుగుతుంది.
ఇబ్బంది పెట్టే డైలాగ్స్
అయితే, ఇలాంటి తరహా కాన్సెప్టులు తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తేం కాదు. ఇలాంటి నిరుద్యోగ కథలపై ఇప్పటికే పలు సినిమాలు, యూట్యూబ్ సిరీస్లలో చూసేయడం వల్ల కథనంలో కొత్తదనం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించడమే కాకుండా, అక్కడక్కడ వినిపించే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్తా ఇబ్బంది పెడతాయి.
అవన్నీ పక్కనపెడితే మాత్రం సిరీస్లో చూపించిన సీన్లు, ఎమోషనల్ డ్రామా, ఇన్డైరెక్ట్ సెటైర్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక మెయిన్ లీడ్స్గా చేసిన వికాస్ వశిష్ఠ, గీతా సైనీ, రాజేశ్ ఖన్నా తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి ఒక్కరు తమ లైఫ్లో ఉండే కాన్ఫ్లిక్స్, ఎమోషన్ను బాగా చూపించారు. అది యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది.
మంచి టైమ్పాస్ ఓటీటీ సిరీస్
సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. బీజీఎమ్ మూడ్కు తగ్గట్టు సాగుతుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. ఇక తర్వాతి ఎపిసోడ్లలో 'స్మార్ట్ ఫార్మింగ్' (ఆధునిక వ్యవసాయం) వైపు కథ మారనున్నట్లు చూపించారు. ఫైనల్గా చెప్పాలంటే సరదాగా కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఇదొక మంచి టైమ్పాస్ ఆహా ఓటీటీ సిరీస్.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


