Allu Sirish Wedding: ఘనంగా అల్లు శిరీష్ పెళ్లి.. వధూవరులను ఆశీర్వదించిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సూర్య
Allu Sirish Wedding: అల్లు శిరీష్, నయనిక రెడ్డి పెళ్లి శుక్రవారం (మార్చి 6) రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి రామ్ చరణ్, పవన్ కల్యాణ్, సూర్యలాంటి వాళ్లు వచ్చారు. అల్లు అర్జున్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి అంబరాన్నంటింది. యంగ్ హీరో అల్లు శిరీష్, తన చిరకాల మిత్రురాలు నయనిక రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 6) రాత్రి హైదరాబాద్లో వీరి వివాహం అత్యంత వైభవంగా, బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

తొలి ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్
శిరీష్ వివాహానికి సంబంధించిన మొదటి ఫోటోను అతని బావ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "అల్లు శిరీష్, నయనిక తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు" అని చరణ్ ట్వీట్ చేశాడు.
ఈ ఫోటోలో శిరీష్, నయనిక ఐవరీ కలర్ దుస్తుల్లో మెరిసిపోతుండగా.. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్, ఉపాసన, నిర్మల (శిరీష్ తల్లి), సురేఖ (చరణ్ తల్లి) కూడా ఉన్నారు.
తారల తళతళలు.. ఒకే వేదికపై చిరు, పవన్, అర్జున్
ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్లతో కలిసి సందడి చేశాడు. విశేషం ఏమిటంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011) ఇదే మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహల వివాహం జరిగింది. తమ వెడ్డింగ్ యానివర్సరీ రోజే తమ్ముడి పెళ్లి జరగడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్-అన్నా లెజ్నెవా, వెంకటేష్, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, సాయి దుర్గ తేజ్, రాశీ ఖన్నా ఈ వేడుకలో మెరిశారు. ఇక కోలీవుడ్ నుంచి స్టార్ హీరో సూర్య, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రత్యేకంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సూర్యను అల్లు అర్జున్ సాదరంగా వేదికపైకి ఆహ్వానించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరై శిరీష్-నయనికలను ఆశీర్వదించారు. గతంలో 'పుష్ప 2' ఘటనపై విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన ఈ వేడుకకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నితిన్ పార్టీలో మొదలైన ప్రేమాయణం
శిరీష్, నయనికల పరిచయం 2023లో హీరో నితిన్, అతని భార్య శాలిని ఇచ్చిన ఒక పార్టీలో (వరుణ్ తేజ్-లావణ్యల కోసం ఇచ్చిన విందు) మొదలైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు దారితీసింది. పెళ్లికి ముందు దుబాయ్లో ఫ్రెండ్స్ కోసం బ్యాచిలర్ పార్టీ, హైదరాబాద్లోని అల్లు స్టూడియోస్లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించారు. అలాగే పసుపు దంచడం, మంగళ స్నానం వంటి సంప్రదాయ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












